కరోనాకు వ్యాక్సిన్‌ : చైనాలో క్లినికల్‌ ట్రయల్స్‌

బీజింగ్‌ : కరోనా వైరస్‌ మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనా, అమెరికా, యూరప్‌ దేశాలతో పాటు భారత్‌ కూడా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆయా దేశాలకు చెందిన వందలాది మంది శాస్త్రవేత్తలు  కరోనా మూలాన్ని కనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. చైనా ఇప్పటికే ఈ విషయంలో క్లినికల్‌ ట్రయల్స్‌ వరకు వెళ్లింది. వ్యాక్సిన్‌ తయారీకి చైనా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు అనుక్షణం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్‌ సైన్సెస్‌లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు తెలుస్తోంది.




ఈ నెల 16న మొదటి ట్రయల్‌ జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 18-60 ఏళ్ల వయస్సున్న 108 మందిని మూడు బృందాలుగా విభజించి భిన్నమైన డోసులు ఇచ్చారు. వీరంతా వూహాన్‌ నగరానికి  చెందినవారే. వీరిలో కొంతమందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ మిగతావారు మాత్రం ప్రశాంతంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. కాగా,  అమెరికా కూడా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో పడింది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్నాయి.